- రుద్రపశుపతి కథ
రుద్రపపశుపతి అనే శివభక్తుడు బసవేశ్వరునికి పూర్వుడు. అమ్యలా అనేఊరిలో ‘‘రుద్రపశుపతి’’ అనే భక్తుడు ఉండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. ఒకరోజు ఆయన ఓ దేవాలయమున జరుగుచున్న పురాణ ప్రవచనమును వినుటకై వెళ్లెను. అక్కడ ప్రవచనకారుడు సముద్రమధన ఘట్టమును గూర్చిచెప్పుచూ ఆ మహాసముద్రము నుంచి విషము పుట్టెనని ఆ విషకారణముచే సర్వలోకములు దేవదైత్యాది గణములు భీతిల్లినవని చెప్పుచూ అంతట పరమేశ్వరుడు ఆ విషయమును ఆరగించెనని ప్రవచనకారుడు తెలియజెప్పెను. శ్రద్ధతో పురాణ ప్రవచనమును వినుచున్న ‘‘రుద్రపశుపతి’’ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ కాలకోట విషమును నిజముగా ఆరగించెనాలేదా అని వడివడిగా ఉపన్యాసకుని వద్దకు వెళ్లి అడిగెను.
అప్పుడు ఉపన్యాసకుడు ‘‘ అనుమానమేమిటయ్యా ‘‘హరుడు’’ విషమును ఆరగించెను. ఇందులో సందేహమువలదు’’ అని చెప్పెను.
అప్పుడు రుద్రపశుపతి ‘‘ ఓ మహానుభావా! ఆ తర్వాత ఆ మహేశ్వరునికి ఏమియూ కాలేదుకదా!’’ అని సందేహముగా ప్రశ్నించెను.
అంతట ఆ ఉపన్యాసకుడు ‘‘ ఆ తర్వాత ఈశ్వరుని సంగతి నాకు తెలియదు’’ అని పల్కెను.
ఆ మాటను వినీవినగానే పిడుగులుపడినట్లై వీపువిరిగినట్లై ‘‘ హా! నేను సర్వనాశనమైతిని’’ అని నేలపైబడి పొర్లుతూ ‘‘ ఓ విశ్వేశా! నిన్ను అందరూ కలిసి వెర్రివాణ్ణి చేశారయ్యా...ఎవరైనా చూస్తూ చూస్తూ విషం తాగుతారా! విషం త్రాగిన వాళ్ళు బ్రతుకుతారా? ఇటువంటి కబురు వినుటకు తగినదేనా? ఏమిచేసేది నాకు నీవే దిక్కని ఇప్పటిదాకా గట్టిగ నమ్ముకొంటిని. నిన్నుగాక ఇంక ఎవరిని ఎరుగనైన ఎరుగనే! ముక్కంటీ! నాకిక దిక్కెవరయ్యా!’’
అని పలుకుతూ ‘‘ ఓ దూర్జటి! నీవు మ్రింగిన విషమును ఉమ్మిపారేయ్ అంది గొంతులోకి పోవునేమో! పోకమునుపే ఉమ్మివేయి. కోటిదండములు నీకర్పించెదను. అయ్యయ్యో! ఎంతపని జరిగింది? ఏమమ్మా! ఓపార్వతీదేవీ! అర్థాంగివనిపించుకుంటూ కూడా ఇటువంటి పరిస్థితులలో ‘‘పరమేశ్వరుని’’ వదలి ఏ పెత్తనాలకు పోయితివి? ఎక్కడికి ఊరేగితివే తల్లీ? నీకు తెలియదమ్మా విషం లోపలికిపోతే ఏమవుతుందో! ఓప్రమధగణాల్లారా! పరమాత్ముల్లారా! ఆ ముక్కంటి కాస్తా కన్నుమూస్తే మనమాయనను దక్కించుకోగలమా? శత రుద్రులారా! ఆ మహేశుని కాపాడరయ్యా...! ఓ వీరభద్రయ్యా! శివుని విడిచి ఎచటికి వెళ్లితివి? ప్రాణపతి విషమును ఆరగించెను. ఆ మహాదేవుని రక్షించరండయ్యా! ’’
అని మనసునున్న బాధను తాళలేక పరిపరి విధముల ప్రార్థించెను. ఇంతలో మళ్లీ మనసున ఆపలేని బాధపెల్లుబిగి ‘‘ అవునులే! తల్లిలేని సంతానమును ఎవరు చూస్తారు? ఎవరు పట్టించు కుంటారు? తల్లే ఉంటే విషం తాగనిస్తుందా? ఈసారి ఈ మరణదండం నుంచి బయటబడినా ఇంకా మనకు చావన్నమాటే లేదు. అని ఇక ఏమాటలునేను వినలేను. శివుడులేని జీవితాన్ని నేననుభవింపలేను. ఇప్పుడే నా ప్రాణమును తీసుకొందును అని పలుకుచూ’’ దగ్గరనే ఉన్న పుష్కరిణిలోనికి గుభీలున దూకెను.
వెంటనే పార్వతీ సమేతుడైన ఆమహాదేవుడు ప్రత్యక్షమై నీటిలోకి జారిపోవుచున్న రుద్రపశుపతిని పట్టుకొని ‘‘ నీ భక్తికి మెచ్చితిని. నీ అభీష్టమేమిటో తెల్పిన వరము నేనివ్వగలనని ’’ బుజ్జగించినాడు.
రుద్రపశుపతి సంభ్రమముతో పరమేశ్వరుని పాదములపైవ్రాలి ‘‘ నాకే వరములూ వద్దు. నీవు విషము మ్రింగుటచే నీవేమైపోవుదవో అని గుండెలదురుచున్నవి. హడలిచచ్చుచుంటిని. వెంటనే కాలకూటవిషాన్ని వెడలకక్కవయ్యా. అప్పుడు కానీ నీదయ నాపై ఉన్నట్లు. నీవిచ్చువరములన్నీ నాకు దక్కినట్లేనని భావిస్తాను’’ అన్నాడు.
అప్పుడు పరమేశ్వరుడు ‘‘ ఏదోలోకములో అలాంటి వార్తపుట్టిందేగాని ఆ విషమును మ్రింగుటకు కాని, ఉమ్మివేయుటకు గాని ఏమంత పెద్దదని, ఏదో నలుసంత.నాకంఠము నందుండిపోయింది. అయినా కాలకూటం నన్నేం చేస్తుంది. నా విషయమున ఆ విషము కాలకూటమూ కాదు. మరేది ఎటువంటి బాధను కల్గించునది కాదు.’’ అనిపలికిన మాటను వినిన రుద్రపశుపతి పకపక నవ్వి
‘‘ ఓ చంద్రశేఖరా! నేను నమ్మలేను. నీవు నిమ్మకు నీరెత్తినట్లుగా ఏమీ జరగనట్లు స్థిమితముగా ఉన్నావు! నీకు చీమైనాకుట్టినట్లేదు. ఇప్పటివరకు కంఠమునందుందని చెప్పుచున్నావు. ఆ కొద్దిలో రవ్వంత మాత్రము కడుపులోనికి జారి ప్రవేశిస్తే అప్పుడు నాగతేమిటి? అప్పుడు నేను ఎటువంటి దుర్వార్తని వినవలసి వచ్చునో! అది వినుటకు కానీ, మనసున తలచుటకు కానీ నాకు శక్తిలేదు. అందుచే నేను ముందుగా మరణించుటకు సిద్ధపడుచున్నాను. నా మాటవిను. నేను చచ్చుట నీకిష్టములేదని తెలిపినను నేను వినను. నీవు నాకిపుడే మాటివ్వగలవు. త్రాగిన విషము వెళ్లగక్కు. అంతే గానీ నీనోటివెంట వచ్చు ఇంకొకమాటను నేవినను.’’ అని మొండిగా పట్టుబట్టినాడు రుద్రపశుపతి.
అప్పుడు పార్వతి ‘‘ ఈ పరమేశ్వరుడు ఆ విషమును ఉమ్మకపోయినచో నిష్కారణముగా ఈ ముగ్ధుడు ప్రాణములు విడుచునేమోనని’’ కలవరపాటు పడెను.
ఆ విషమును ఉమ్మినచో సర్వలోకములు కాల్చివేస్తుందని నారదాది ముఖ్యదేవతలు వణుకుచుండిరి. అప్పుడు మహేశుడు రుద్రపశుపతిని మహదాదరముతో కౌగలించుకొనెను.
‘‘ ఓమహాభక్తా! ప్రమధులమీద ఒట్టు. నీ పాదములమీద ఒట్టు. ఈవిషమునన్నేమి చేయదు నమ్ము. నీమాట వమ్ముకాదు నిజం. కాదు కూడదు నీకు నమ్మకం కుదరటం లేదంటావా! నాకుడి తొడకెక్కి శితి కంఠంవైపే రెప్పలార్పకుండా చూస్తూ ఉండమని’’ వాత్సల్యంతో తన తొడపై ఆ ముగ్ధభక్తుణ్ణి ఎక్కించుకొన్నాడు పరమశివుడు.
అప్పుడు రుద్రపశుపతి హాలాహలం గొంతునుంచి జారుతున్నట్లు కనపడగానే పొడుచుకొని చచ్చెదనని తన కరవాలమును రొమ్ములపై ఆనించుకొని శివుని కంఠంవైపే అనిమిషుడై చూస్తూ పశుపతి తొడలమీద రుద్రపశుపతి ఇప్పటికీ అలాగే ఉన్నాడు.
(సశేషం)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి