నవగ్రహాల పురాణం 4

 4 వ అధ్యాయం

పురాణ ప్రారంభం - 4 వరోజు

కుమారా ! తపస్సు చేయి ! నీ కర్తవ్య నిర్వహణా విధానం నీకు ధ్యాన గోచరమవుతుంది ! నువ్వు సృష్టించే జీవుల భవితవ్యాలను వాళ్ళ ఫాల ఫలకాల మీద లిఖించే అధికారం నీదే ! నీ సృష్టి విన్యాసంలో మానవజాతికి మహోపకారం జరగాల్సి ఉంది.  జ్యోతిర్మండలాలలో సూక్ష్మరూపాలలో నెలకొని వున్న నవగ్రహ దేవతలు సశరీరంగా ఆవిర్భవించాలి. ప్రాణుల జీవన విధానాన్ని నిర్దేశించే ఆ నవగ్రహాలను ఆరాధిస్తూ ప్రసన్నం చేసుకుని నరులు సుఖ శాంతులతో జీవించాలి. సృష్టికర్త కళ్ళు తామరరేకుల్లా విచ్చుకున్నాయి. ఆయన చూపులు చుట్టూ తిరిగాయి. ఆశ్చర్యం ! లోకాలు , సముద్రాలు , పర్వతాలు , అరణ్యాలు , ఉరకలు పెడుతున్న నదులు ! విరాట్ పురుషుని సంకల్పం సాకారమై సాక్షాత్కరిస్తోంది.  పరమాత్మ ప్రథమాదేశం ఆయనకు గుర్తుకు వచ్చింది. మానస పుత్రులు... సంకల్ప సృష్టిబ్రహ్మ అరమోడ్పు కనులతో సంకల్పించాడు.ఆయన సంకల్పస్థానం నుండి నలుగురు పుత్రులు ఆవిర్భవించారు. తనవైపు ఆశ్చర్యంగా చూస్తున్న తన కుమారులతో బ్రహ్మ ఇలా అన్నాడు. నేను సృష్టికర్త అయిన బ్రహ్మను. నా మనోసంకల్పంతోమిమ్మల్నిసృష్టించాను. మీరు నా మానసపుత్రులు  మీ నలుగురికీ నామ నిర్దేశం చేస్తాను. అంటూ బ్రహ్మ ఒక్కొక్కర్నీ నిర్దేశిస్తూ - సనకుడు , సనందుడు , సనత్ సుజాతుడు , సనత్ కుమారుడు అనే పేర్లు నిర్ణయించాడు. సనకాది మానస పుత్రులు ఆయనకు నమస్కరించారు. నాయనలారా ! నా జనకపాదులైన శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం జీవరాశి సృష్టి క్రమంలో ఓం ప్రథమంగా మిమ్మల్నిఆవిర్భవింపజేశాను.సంతానోత్పత్తికి క్షేత్రాలైన స్త్రీమూర్తులను కూడా సృష్టి చేస్తాను. ఆ స్త్రీ మూర్తులలో తగినవారిని స్వీకరించి, సంతానోత్పత్తి చేయండి.

సనకుడూ , సనందుడూ , సనత్కుమారుడూ , సనత్ సుజాతుడూ నలుగురూ ఒకేసారి తలలు అడ్డంగా వూపారు.మేము శుద్ధ సత్వ స్వరూపులం !" అన్నాడు సనకుడు. 

మేం స్వీకరించేదీ , దానం చేసేదీ కేవలం జ్ఞానమే !" సనందుడు అన్నాడు. సంతానోత్పత్తి మా అభిమతం కాదు ! అన్నాడు అందుకుంటూ సనత్కుమారుడు.ఔను మా అభిమతం , ఆశయం కేవలం జ్ఞానయజ్ఞం  అన్నాడు సనత్ సుజాతుడు. బ్రహ్మకళ్ళు పెద్దగాచేసి చూశాడు. మీరు పసిపాపలు ! ఈ వయసులో జ్ఞానార్జనా ? నా సంకల్పాన్ని అనుసరిస్తూ ఎదగండి , పెరిగి యువకులై తగిన పత్నులను... సృష్టికర్తా ! మేం శాశ్వతంగా యిదేప్రాయంతో , ఇవే శరీరాలతో బాల బ్రహ్మచారులుగా లోక సంచారం చేస్తూ జ్ఞానయాత్ర సాగిస్తాం. మన్నించండి ! సనకుడు నిష్కర్షగా అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తున్న బ్రహ్మకు నమస్కారం చేసి , నలుగురూ వెనుదిరిగి వెళ్తున్నారు. తన ప్రయత్నానికీ , ఆదేశానికీ ఆదిలోనే అంతరాయం జరిగినందుకు బ్రహ్మ నివ్వెరపోయాడు. ఆలోచనలో పడ్డాడు. పరబ్రహ్మ అయిన శ్రీహరి సంకల్పం ఎలా వుంటే అలాగే జరుగుతుందన్న ఓదార్పు ఆయనలో కలిగింది. తన మాట పాటించి , ప్రజోత్పత్తి చేసే పరిణతి కలిగిన మానస పుత్రుల్ని తాను సృష్టించాలి. ఆలోచన విరమించి , బ్రహ్మ కళ్ళు మూసుకున్నాడు. ఆయన హృదయంలో ప్రణవం ప్రతిధ్వనిస్తోంది. ఆయన మానసంలో ఏదో సంకల్పం రూపుదిద్దుకుంటోంది. భ్రూమధ్య భాగాన్ని చూపుడు వేలితో స్పృశించి , నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆయన ఎదురుగా , ఒకరి తరువాత ఒకరుగా తొమ్మండుగురు మానసపుత్రులు. ఆవిర్భవించారు. అందరూ తెల్లటి వస్త్రాలు ధరించి వున్నారు. పాతికేళ్ళ వయసుతో ఆవిర్భవించిన తన మానస పుత్రుల్ని బ్రహ్మ ఆనందంగా చూశాడు. ఆర్యా...! మీరెవరు ? మేమెవరు  మానస పుత్రులు అడిగారు. శ్రీ మహావిష్ణువు జ్యేష్ఠపుత్రుడూ , సృష్టిలో ఆదిజుడూ , సృష్టికర్త అయిన తన పేరు బ్రహ్మ అనీ , వాళ్ళు తన మానస పుత్రులనీ వివరించిన బ్రహ్మ - వాళ్ళకు అత్రి , మరీచి , భృగువు , పులస్త్యుడు , పులహుడు , క్రతువు , కర్దముడు , అంగిరసుడు , వసిష్ఠుడు అనే నామధేయాలు నిర్ణయించాడు. సంకల్ప సంభవులారా ! విశ్వసృష్టి విన్యాసాన్ని ప్రారంభించి , ఆ మహత్కార్య నిర్వాహకులుగా మిమ్మల్ని సృష్టించాను. బ్రహ్మ మానసపుత్రులుగా ప్రఖ్యాతులయ్యే మీ నుండి దేవ , గంధర్వ , కిన్నర , కింపురుష , గరుడ , రాక్షసాది వివిధ ప్రాణుల ఉత్పత్తి జరగాల్సి వుంది. మీ నివాసానికీ , జీవన వికాసానికీ అవసరమైన లోకాలూ , ఆ లోకాలలో సకల సదుపాయాలూ , అన్నీ సిద్ధంగా వున్నాయి. సకాలంలో మీకు పత్నులు. లభిస్తారు.పత్నులా ? అత్రి ఆశ్చర్యంగా అన్నాడు. పత్నులంటే ఎవరు తండ్రీ ! మరీచి అడిగాడు. పత్నులంటే పురుషుడికి తోడుగా , జోడుగా వుండే స్త్రీ మూర్తులు బ్రహ్మ వివరిస్తున్నాడు.భృగువు ప్రశ్న ఆయనకు అడ్డు తగిలింది. ఆ స్త్రీ మూర్తులు అవసరమా జనకా? అవసరమే. సంతానం కలగాలంటే ప్రతి ప్రాణికీ తోడు అవసరం. పత్నీ పరిగ్రహణం , సంతాన సాఫల్యం , దాంపత్య జీవనం మొదలైనవన్నీ సృష్టి రహస్యాలు. క్రమానుగతంగా అవన్నీ మీకు సహజంగా అవగాహనవుతాయి బ్రహ్మ ఓపికగా వివరించాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి