నవగ్రహాల పురాణం 1

 1 వ అధ్యాయం

పురాణ ప్రారంభం


ఈ రోజు నుండినవగ్రహ పురాణం ప్రారంభం...


జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతింతమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్!

నిర్వికల్పాలలో శ్లోకం శ్రావ్యంగా ధ్వనించింది ; భక్తి ప్రతిధ్వనించింది. చేతులెత్తి సూర్యభగవానుడికి నమస్కరిస్తున్నాడాయన. 

శిష్యులు విమలానందుడూ , శివానందుడు , సదానందుడు , చిదానందుడు గురువుగారిని అనుసరిస్తూ సూర్యుడికి నమస్కారాలు అర్పించారు.

పడమటి ఆకాశంలో గుండ్రటి సూర్యుడు దిశా సుందరి నుదురు మీద సింధూర తిలకంలా మెరిసిపోతున్నాడు. గ్రహణం వీడిన సూర్యుడు ఎలా ధగధగలాడిపోతున్నాడో చూశారా? తదేకంగా సూర్యబింబాన్నే చూస్తూ అన్నాడు నిర్వికల్పానంద. ఔను గురువుగారూసూర్యభగవానుడు కళకళలాడుతున్నాడు విమలానందుడు చిరునవ్వుతో అన్నాడు. 

గ్రహణం' నుంచి 'మోక్షం' సిద్ధించింది కదా ! అందుకే తెగవెలిగిపోతున్నాడు చిదానందుడు నవ్వాడు.అందరూ నదిలోంచి గట్టు వైపు అడుగులు వేస్తున్నారు.

ఈ గ్రహణాన్నీ , మోక్షాన్నీ చూశాక ఆసూర్యుడిచరిత్ర ,పుట్టుపూర్వోత్తరాలతో సాకల్యంగా వినాలనిపిస్తోంది... గురువుగారూ ! వినిపిస్తారా ? సదానందుడు ఆసక్తిగా అడిగాడు.

ఒక్క గ్రహరాజు చరిత్ర మాత్రమే ఏమిటి , సదానందా.... గురువుగారి అమృతవాణి ద్వారా నవగ్రహాల కథ అంతా విందాం !శివానందుడు ఉత్సాహంగా అన్నాడు.

నిర్వికల్పానంద గట్టుమీద ఆగి శిష్యుల్ని కలయజూశాడు. మన శివానందుడి ఆలోచన బాగుంది. నవగ్రహాల చరిత్రలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని వుంటాయి. 

అందుచేత అందరి గురించీ తెలుసుకుందాం. పదండి. ఇవాళే నవగ్రహ పురాణం ప్రారంభించుదాం !

ఆశ్రమంలో వాతావరణం ప్రశాంతంగా వుంది. పక్షుల కిలకిలారావాల్నీ , పువ్వుల సువాసనల్నీ మోసుకువస్తూ పరవశిస్తోంది పిల్లగాలి.

నిర్వికల్పానంద అరుగు మీద కూర్చున్నాడు. శిష్యులు ఆయన ముందు వినయంగా కూర్చున్నారు. నిర్వికల్పానంద మొహం మీద చిరునవ్వు మెరిసింది.

నవగ్రహాల చరిత్ర వినాలని మీరు ముచ్చట పడటం చాలా మంచిది. ఒకరి చేత 'చెప్పించుకుని వినాలి' అనుకోవడమే గొప్ప విషయం. 

ఎందుకంటే - 'శ్రవణం , కీర్తనం , స్మరణం , పాదసేవనం , అర్చనం , వందనం , దాస్యం , సఖ్యం , ఆత్మనివేదనం' అనేవి భక్తి యోగంలో తొమ్మిది విధానాలు. ఈ తొమ్మిదింటినీ కలిపి - 'నవ విధ భక్తి' అన్నారు పెద్దలు. 

ఈ తొమ్మిదింటిలో 'శ్రవణం' అనేది ప్రథమ విధానం మాత్రమే కాదు. ప్రధాన విధానం కూడా ! భక్తి ప్రక్రియలలో శ్రవణానిదే పెద్దపీట !

నవగ్రహ పురాణం అనేది ఒక మహత్తర , బృహత్తర చరిత్ర. ఆ పురాణ శ్రవణం నిర్విఘ్నంగా , నిరంతరాయంగా సాగిపోవాలి. నిర్విఘ్నంగా చేసే నవగ్రహ పురాణ ప్రవచనం , శ్రవణం - నవగ్రహాల ఆరాధనతో సమానం అన్నారు విజ్ఞులు.

అయితే , గురువుగారూ , నవగ్రహ పురాణ శ్రవణం ప్రారంభించి , పూర్తయ్యేదాకా మనం సంచారం వెళ్ళమన్న మాట విమలానందుడు ప్రశ్నించాడు.

ఔను. సంకల్పించాం కదా ! నవగ్రహ పురాణ శ్రవణాన్ని శుభంగా ప్రారంభించి , శుభంగా పరిసమాప్తం చేద్దాం నిర్వికల్పానంద అన్నాడు.

గురువుగారూ ! ఒక సందేహం...." సదానందుడు అన్నాడు.ఈ సదానందుడికి సదా సందేహాలే ! చిదానందుడు నవ్వుతూ అన్నాడు. శిష్యులు ఆ నవ్వుతో శృతి కలిపారు.

సందేహం అనేది మానసికమైన అన్వేషణ. సందేహాలకు సమాధానాలు పొందటం కూడా సాధనలో ఒక భాగమే ! ప్రశ్నోపనిషత్తు విన్నారు కదా ! నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు. నీ సందేహమేమిటో అడుగు , సదానందా !

ఏం లేదు గురువుగారూ.... నవగ్రహాలు అనగానే మనిషి భయభక్తులతో పూజలు చేస్తాడు. ఎందుకంటారు?మంచిప్రశ్న ! నిజమే ! 

మానవులు భయాన్నీ , భక్తినీ రంగరించి ఆరాధించేది ఒక్క నవగ్రహ దేవతలను మాత్రమే ! నవగ్రహాల ప్రభావమూ , ప్రతాపమూ అంతగొప్పవి ! నిర్వికల్పానంద వివరిస్తూ అన్నాడు.

మానవుడు మాతృగర్భంలో పడిన క్షణం నుండి , కాలగర్భంలో కలిసిపోయేదాకా - అతని జీవితం పూర్తిగా నవగ్రహాల ప్రభావం మీద ఆధారపడి వుంటుంది.”...

సశేషం...

1 కామెంట్‌: